అయోధ్య రాముడ్ని దర్శించాలనుకునే భక్తులకు గుడ్‌న్యూస్.. తొలి వంద రోజులు 1000కిపైగా రైళ్లు

  • జనవరి 19 నుంచి అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
  • దేశంలోని వివిధ నగరాల నుంచి పరుగులు
  • డిమాండ్‌ను బట్టి రైళ్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం
  • 50 వేల మంది ప్రయాణికులను తట్టుకునేలా అయోధ్య స్టేషన్ పునరుద్ధరణ
వచ్చే నెలలో అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. అయోధ్యను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తొలి వంద రోజులు ఏకంగా 1000కిపైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఇవన్నీ అయోధ్యకు పరుగులు తీయనున్నాయి. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుండగా, 23న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది. అదే రోజు నుంచి భక్తులకు ఆలయ దర్శనం అందుబాటులోకి వస్తుంది. అదే నెల 19 నుంచి రైళ్లు అందుబాటులోకి వస్తాయి. 

ఇవన్నీ ఢిల్లీ, ముంబై, పుణె, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ సహా వివిధ ప్రధాన నగరాల నుంచి నడుస్తాయి. డిమాండును బట్టి రైళ్ల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు తెలిపారు. మరోవైపు, భక్తల తాకిడిని తట్టుకునేలా అయోధ్య రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించారు. రోజుకు 50 వేల మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో ఆ మేరకు దాని సామర్థ్యాన్ని పెంచారు. జనవరి 15 నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది.

Ayodhya Ram Mandir
Indian Railways
Special Trains

More Telugu News