బీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. కాంగ్రెస్ లోకి వస్తామంటున్నారు: రేణుకా చౌదరి

  • గతంలో మా 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాక్కుందన్న రేణుక
  • ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థులే తమకు ఫోన్లు చేస్తున్నారని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం తమకు లేదన్న ఫైర్ బ్రాండ్
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్ర నేతలు, ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అంచనాలను వెలువరించినప్పటికీ... ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన అవసరం లేదని, ఎగ్జాక్ట్ పోల్స్ ను నమ్ముదామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తమదే విజయం అని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 

మరోవైపు, అందరూ టెన్షన్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాక్కుందని... ఈసారి పరిస్థితి వేరుగా ఉందని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని... తనకు కూడా కొందరి నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు. తమను మర్చిపోవద్దని, తమను గుర్తుంచుకోవాలని, అవసరమైతే తాము కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ అభ్యర్థులు ఫోన్లు చేసి చెపుతున్నారని అన్నారు. తమకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు.

Renuka Chowdhury
Congress
BRS
Telangana Elections

More Telugu News