డ్వాక్రా మహిళలకు డ్రోన్లు... ఉపాధి కోసం సరికొత్త పథకం

  • స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని కేంద్ర నిర్ణయం
  • ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
  • రైతులకు డ్రోన్లను అద్దెకివ్వడం ద్వారా డ్వాక్రా మహిళలకు ఆదాయం
డ్వాక్రా మహిళల కోసం కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకువస్తోంది. స్వయం సహాయక సంఘాలకు కేంద్రం డ్రోన్లు అందించనుంది. స్వయం సహాయక సంఘాలు ఈ డ్రోన్లను రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఉపాధి పొందొచ్చు. 2023 నుంచి 2026 మధ్య కాలంలో 15 వేల డ్రోన్లను డ్వాక్రా మహిళలకు అందించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేంద్రం రూ.1,261 కోట్లు కేటాయించనుంది. 

లబ్దిదారులకు అత్యధికంగా రూ.8 లక్షల సాయం అందించనున్నారు. డ్రోన్లు పొందిన స్వయం సహాయక సంఘాల వారికి డ్రోన్ పైలెట్ శిక్షణ ఇస్తారు. అంతేకాదు, 10 రోజుల పాటు వ్యవసాయ సంబంధ పనులపై శిక్షణ కూడా ఉంటుంది. తద్వారా... రైతులు పురుగు మందుల పిచికారీ, ఎరువుల వాడకం వంటివి డ్రోన్ల ద్వారా చేపట్టే వీలుంటుంది. 

డ్రోన్ల సాయంతో వ్యవసాయ పనుల వల్ల ఎంతో సమయం ఆదా అవడమే కాకుండా, మానవ వనరుల కొరతను అధిగమించే వీలుంటుంది. ఈ పథకం ద్వారా మహిళలు గణనీయంగా ఆదాయం పొందే వీలుంటుందని కేంద్రం భావిస్తోంది.

Drones
Women
Self Help Groups
Union Govt

More Telugu News