‘ధరణి’లో కేసీఆర్‌కు అదనంగా గుంటభూమి.. ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా వెల్లడించిన సీఎం

  • తమకున్న భూమికన్నా గుంట భూమి ఎక్కువగా కనిపిస్తోందన్న కేసీఆర్
  • ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని విపక్షాల ప్రశ్న
  • ఇంకెవరిదో గుంటభూమిని కేసీఆర్ కలిపేసుకున్నారని ఆరోపణ
  • ఇలాంటి రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయుంటున్న విపక్షాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండ్రోజుల క్రితం గజ్వేల్, కామారెడ్డి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తన పాస్‌బుక్‌లు, 1బీ రికార్డులో గుంటభూమి అధికంగా చూపిస్తోందని అందులో కేసీఆర్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లిలో 36.1450 ఎకరాలు, అదే మండల శివారు వెంకటాపూర్‌లో 10 ఎకరాల భూమి ఉందని, తన భార్య శోభ పేరిట 7.1650 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. 

ఇద్దరి పేరిట మొత్తం 53.31 ఎకరాల భూమి ఉండగా పాస్‌బుక్, 1బీలో 53.31 ఎకరాలు అంటే గుంట భూమి ఎక్కువగా చూపిస్తోందని కేసీఆర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. స్వయంగా సీఎం పేరుతో గుంటభూమి ఎక్కువగా నమోదైనా అధికారులు ఇప్పటి వరకు మౌనంగా ఎందుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

అఫిడవిట్‌లో తప్ప ఇప్పటి వరకు ఆయన ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే, ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ధరణిలో భూమి ఎక్కువ తక్కువలు నమోదైన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయని విమర్శిస్తున్నాయి. సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం ఇంకెవరిదో భూమిని ఆయన కలిపేసుకున్నట్టే కదా అని ప్రశ్నిస్తున్నాయి.

KCR
Gajwel
Kamareddy
Election Nomination
KCR Land

More Telugu News