కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన టీడీపీ సీనియర్ నేత

  • టీడీపీకి గుడ్ బై చెప్పిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
  • టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన రావుల
  • టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా కూడా బాధ్యతలు
తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని తెంచుకుని బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రావులను కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 

టీడీపీ తరపున రావుల చంద్రశేఖర్ రెడ్డి 1994, 2009 ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విప్ గా పని చేశారు. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ ముఖ్యనేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లారు. రావుల మాత్రం టీడీపీని వీడలేదు. ఇప్పుడు ఆయన పార్టీ మారారు. 


Ravula Chandra Sekhar Reddy
Telugudesam
BRS
KTR

More Telugu News