ముత్తిరెడ్డి మద్దతుతో జనగాంలో జెండా ఎగరవేద్దాం: పల్లా రాజేశ్వరరెడ్డి

  • జనగామలో ఓడిపోయే అవకాశం ఇవ్వద్దనేది కేసీఆర్ ఆలోచన అన్న పల్లా  
  • కేసీఆర్‌కు ముత్తిరెడ్డి అంటే గౌరవం ఉందని వెల్లడి 
  • రేపో ఎల్లుండో కేసీఆర్ ప్రకటించాక కలిసి వెళ్దామన్న పల్లా
జనగామ నియోజకవర్గం టిక్కెట్ బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వరరెడ్డికి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, పల్లా కూడా తనకు టిక్కెట్ వచ్చినట్లుగానే మాట్లాడారు. శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ... కీలక వ్యాఖ్యలు చేశారు. ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దామని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎక్కడైనా మార్పు జరగాలనుకున్నప్పుడు ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను ఒప్పించి ముందుకు సాగాలన్నారు. స్టేషన్ ఘనపూర్‌లోను ఎమ్మెల్యే రాజయ్యను మార్చి కడియం శ్రీహరికి ఇచ్చారని, దీంతో తాము రాజయ్యను కలిసి మాట్లాడామన్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్‌ను కచ్చితంగా గెలిపించుకోవాలన్నారు. జనగామలోను ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పదేళ్లుగా బాగా పని చేశారన్నారు. ఆయన ఉద్యమంలో కూడా ఉన్నారని గుర్తు చేశారు. అయితే కొన్ని ఇబ్బందులవల్ల జనగామలో మనం ఓడిపోయే అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు ముత్తిరెడ్డి అంటే గౌరవం ఉందన్నారు.

ముత్తిరెడ్డిని పిలిపించి మాట్లాడుతారని, అందరం ఏకతాటిపై వెళ్దామన్నారు. తాను కేసీఆర్, ముత్తిరెడ్డిల ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. రేపు ఎన్నికల్లో కేసీఆర్ ఆశీర్వాదంతో పాటు మంత్రులు, ముత్తిరెడ్డి సహా అందరం కలిసికట్టుగా ముందుకు సాగి జనగామలో బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. రేపో ఎల్లుండో కేసీఆర్ టిక్కెట్ ప్రకటించాక అందరం కలిసి వెళ్దామన్నారు.

palla rajeswar reddy
muthireddy yadagiri reddy

More Telugu News