ఇప్పటికే పదిహేను కేసులు పెట్టారు.. మరో కేసు పెడతారట: అయ్యన్నపాత్రుడు

  • విశాఖలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన అయ్యన్నపాత్రుడు
  • టీడీపీ కోసం ప్రాణాలు వదిలేందుకు సిద్ధమని వ్యాఖ్య
  • విశాఖలో వైసీపీ నాయకులు భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపణ
తనపై ఇప్పటికే పదిహేను కేసులు పెట్టారని, మరో కేసు పెడతారంట.. దేనికీ భయపడేది లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ విశాఖలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ కోసం ప్రాణాలు కూడా వదిలేందుకు సిద్ధమన్నారు. వైసీపీ నాయకులు రౌడీలను పెట్టి మరీ విశాఖలో భూములు ఆక్రమించారని, నగరంలో దాదాపు రూ.75వేల కోట్ల ఆస్తులను లాక్కున్నారన్నారు.

దేశంలో అతి తక్కువ ధరకు ఫైబర్ నెట్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. తమ హయాంలో రూ.149కే ఫైబర్ నెట్ ఇస్తే, ఇప్పుడు దానిని రూ.450కి పెంచారన్నారు. తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్, ఇప్పుడు మద్యం పైనే ఆధారపడ్డారన్నారు. 9.6 శాతం వడ్డీకి పాతికేళ్లకు తనఖా పెట్టి మద్యం అమ్మకాలపై అప్పు తెచ్చారని ఆరోపించారు. ఈ అప్పును ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు.

Ayyanna Patrudu
Telugudesam
Andhra Pradesh
Chandrababu

More Telugu News