చంద్రబాబు గారూ! బీకాంలో ఫిజిక్స్ పెట్టాలని కేంద్రానికి లేఖ రాయండి: విజయసాయిరెడ్డి వ్యంగ్యం

  • కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించడమే కాక లేఖలు రాయడం మీకే చెల్లు అని విమర్శ
  • 2024 తర్వాత భవిష్యత్తే లేని టీడీపీ 2047కు విజన్ డాక్యుమెంట్ ఎలా విడుదల చేస్తోందని ప్రశ్న
  • శపిస్తే నిజం కావడానికి చంద్రబాబు ఏమైనా దేవుడా? మునీశ్వరుడా? అని చురకలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి చురకలు అంటించారు. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంపై విజయసాయిరెడ్డి స్పందించారు. కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించడమే కాకుండా కేంద్రానికి లేఖలు రాయడం మీకే చెల్లిందని విమర్శించారు.

'బీకామ్‌లో ఫిజిక్స్ పెట్టాలని, ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ లెటర్స్ రాస్తే బాగుంటుందేమో ఆలోచించండి చంద్రబాబూ గారు! కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించడమే కాకుండా మళ్లీ కేంద్రానికి లేఖలు రాయడం మీకే చెల్లింది' అని ట్వీట్ చేశారు.  ఈ రోజు ఉదయం ఆయన రెండుమూడు ట్వీట్లు చేశారు.

'2024 తర్వాత భవిష్యత్తే లేని టీడీపీ 2047కు విజన్ డాక్యుమెంట్ ఎలా విడుదల చేస్తుందో. రెమిటెన్సెస్ కోసం ఎక్కువమంది యువతను విదేశాలకు పంపించాలనే ఆలోచన దేశ వ్యతిరేక చర్య అవుతుంది. మన దేశంలోనే ఉద్యోగాలు సృష్టించాలి. తద్వారా తెలుగువారంతా భారతదేశంలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. వీరంతా దేశ అభివృద్ధికి తోడ్పడుతార'ని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు చేసిన ట్వీట్‌లో 'చివరకు ఎంతకు దిగజారిపోయారు బాబుగారూ! రాజకీయంగా ఎదుర్కోలేక ఆ వ్యక్తే లేకపోతే బాగుండు అనే దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. భూమి పేలిపోయి అందులోకి ఆయన కూరుకుపోవాలా? పురాణగాథల్లో వలె శపిస్తే నిజమైపోవడానికి మీరేమైనా మునీశ్వరులా? దేవతలా?' అని చురకలు అంటించారు.

'విజన్ 2020 అని దేశమంతా తిరిగి స్వీయ ప్రగల్భాలు పలికినా 2004లో ప్రజలు చిత్తుగా ఓడించారు. ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో  గారడీ చేయాలని చూస్తున్నాడు బాబుగారు. ఓటి పడవకు పైన ఎన్ని అలంకారాలు చేసినా నీటిలోకి వెళ్లిన తర్వాత మునగక తప్పదు' అని పేర్కొన్నారు.

Vijayasai Reddy
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News