గద్దర్ స్మారకంగా ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేయాలి: సీపీఐ నారాయణ

  • ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
  • గద్దర్ తో సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్న సీపీఐ నారాయణ
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సూచన
జన వాగ్గేయకారుడు గద్దర్ మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. గద్దర్ తో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తామిద్దరం తెలంగాణ అంతటా తిరగామని నారాయణ వెల్లడించారు. 

ఆయన తొలుత విప్లవకార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఆ తర్వాత విభేదాలు రావడంతో జనంలోకి వచ్చారని వివరించారు. తదనంతర కాలంలో వామపక్ష ప్రజాస్వామ్య ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు.

"పొడుస్తున్న పొద్దు మీద నడస్తున్న కాలమా... పోరు తెలంగాణమా" అంటూ ఆయన గీతం రాష్ట్రమంతా మార్మోగిపోయిందని, గద్దర్ తెలంగాణ ఉద్యమానికి తలమానికంలా నిలిచాడని నారాయణ కొనియాడారు. అటువంటి వ్యక్తి మరణించడం బాధాకరమని, ఆయన కుటుంబానికి సీపీఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని వెల్లడించారు. 

ఆయన అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సూచించారు. గద్దర్ స్మారకంగా ఏదైనా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

CPI Narayana
Gaddar
Demise
Memorial

More Telugu News