వరంగల్‌లో తీవ్ర స్థాయిలో వరదలు వచ్చాయి.. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: గవర్నర్ తమిళిసై

  • వరంగల్ జిల్లాలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్
  • స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్న తమిళిసై
  • ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య
ఇటీవల భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలోని ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. వరంగల్‌లో వరదలు తీవ్ర స్థాయిలో వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టాలని సూచించారు. చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. బాధితులు తాగునీరు, నిత్యావసర వస్తువులు, మెడికల్ కిట్లు అందించాలని అన్నారు. 

రెండు జిల్లాల్లో పలు ప్రాంతాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ రోజు పర్యటించారు. జవహర్‌నగర్‌, నయూమ్ నగర్, భద్రకాళి బండ్, ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ లో ముంపు ప్రాంతాలను తమిళిసై పరిశీలించారు. ముంపు ప్రాంతాల కాలనీల్లోని బాధితులను పరామర్శించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల్లో బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని గవర్నర్ తమిళిసై కొనియాడారు.

Governor
Tamilisai Soundararajan
Warangal
flood
rains

More Telugu News