పందెం కాసి150 మోమోలు తిని ప్రాణాలు కోల్పోయిన యువకుడు!

Bihar man dies in momo eating challenge
  • బీహార్‌లోని చంపారన్ జిల్లాలో ఘటన
  • రోడ్డుపక్కన అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతదేహం
  • స్నేహితులు విషం పెట్టి చంపారంటున్న బాధిత కుటుంబం
స్నేహితులతో సరదాగా కాసిన పందెం యువకుడి నిండుప్రాణం తీసింది. బీహార్‌లో జరిగిందీ ఘటన. తూర్పు చంపారన్ జిల్లాలోని సిహోర్వా గ్రామానికి చెందిన విపిన్ కుమార్ పాశ్వాన్ (25) సివాన్ జిల్లాలోని గ్యానీమోర్ సమీపంలో ఓ మొబైల్ రిపేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజువారీలానే గురువారం షాప్‌కు వెళ్లాడు. సాయంత్రం స్నేహితులను కలిశాడు. ఈ క్రమంలో ఎవరు ఎక్కువ మోమోలు తింటారన్న విషయంలో వారి మధ్య పందెం మొదలైంది. ఈ క్రమంలో 150 మోమోలు తిన్న పాశ్వాన్ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. 

ఆ తర్వాత అతడి మృతదేహం గోపాల్‌గంజ్, సివాన్ జిల్లాల సరిహద్దులోని రోడ్డుపక్కన అనుమానస్పద స్థితిలో పడి ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, విపిన్ తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. తన కుమారుడికి విషం పెట్టి చంపారని ఆయన తండ్రి విష్ణు మాంఝీ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని, నివేదిక వచ్చాక మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు.
Go Back to Shorts
Momo Eating Challenge
Bihar
Gopalganj

More Telugu News