ముందస్తు ఎన్నికలని లీకులు ఇచ్చేది వాళ్లే... ఖండించేది వాళ్లే: చంద్రబాబు

Chandrababu slams YCP leadership
  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ప్రొద్దుటూరు నేతలు
  • పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలకు సూచించిన చంద్రబాబు
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టీకరణ
తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన నేతలు టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. పార్టీ బలోపేతం కృషి చేయాలని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ పలు రాజకీయ విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్లిన జగన్ ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. ముందస్తు ఎన్నికలని లీకులు ఇచ్చేది వాళ్లేనని, మళ్లీ ఆ వార్తలను ఖండించేది కూడా వాళ్లేనని ఎద్దేవా చేశారు. 

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని సమరోత్సాహం ప్రకటించారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా జగన్ ఇంటికి వెళతారని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఇక, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. పేదలపై రూ.51 కోట్ల మేర విద్యుత్ భారం మోపారని వెల్లడించారు. తమ ప్రభుత్వం రాగానే కరెంట్ చార్జీలు తగ్గిస్తామని తెలిపారు. నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. 

అటు, అమూల్ డెయిరీ అంశంపైనా చంద్రబాబు స్పందించారు. చిత్తూరు డెయిరీని అమూల్ పరం చేశారని మండిపడ్డారు. చిత్తూరు డెయిరీ ఆస్తులను అమూల్ కు ఇచ్చేశారని వివరించారు. రూ.6 వేల కోట్ల ఏపీ రైతుల ఆస్తులను అమూల్ కు కట్టబెట్టారని, గుజరాత్ డెయిరీకి ఇక్కడి జిల్లాలను పంచిపెటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కర్ణాటకలో అమూల్  డెయిరీని అంగీకరించలేదని, తెలంగాణలో విజయ డెయిరీని అభివృద్ధి చేసుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అమూల్ డెయిరీకి ఎన్ని ఆస్తులు కట్టబెట్టారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. 

తన ప్రసంగంలో చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. చిరువ్యాపారుల వద్ద కూడా వసూళ్లకు రాచమల్లు అలవాటుపడ్డారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Chandrababu
TDP
Proddutur
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News