ఆనం వెంకటరమణా రెడ్డిపై దాడి యత్నం వీడియో పంచుకున్న చంద్రబాబు

  • నెల్లూరులో టీడీపీ అధికార ప్రతినిధిపై దాడికి యత్నం
  • తరిమికొట్టిన టీడీపీ శ్రేణులు
  • పిరికిపంద చర్య అంటూ చంద్రబాబు ఆగ్రహం
  • జగన్ అప్రజాస్వామిక పాలనకు ప్రజలే ముగింపు పలుకుతారని వెల్లడి
నెల్లూరులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు దుండగులు దాడికి యత్నించడం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

నిలిపి ఉంచిన వాటర్ ట్యాంకర్ చాటు నుంచి కొందరు వ్యక్తులు కర్రలు చేతపట్టుకుని ఆనం వెంకటరమణారెడ్డి నివాసంలోకి వెళ్లడం, వెంటనే పరుగులు తీసుకుంటూ బయటికి రావడం, వారిని వెంట తరుముతూ ఆనం తదితరులు ఇంట్లోంచి బయటికి రావడం ఆ వీడియోలో చూడొచ్చు. 

తమ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. తనను, తన సన్నిహితులను ప్రశ్నించేవారి నోరు మూయించేందుకు మరోమారు రౌడీ మూకలను ఉసిగొల్పిన జగన్ ఈ చర్య పట్ల సిగ్గుపడాలని పేర్కొన్నారు. జగన్ అప్రజాస్వామిక విధానాలకు  ప్రజలు త్వరలో చరమగీతం పాడతారని చంద్రబాబు స్పష్టం చేశారు

Chandrababu
Anam Venkataramana Reddy
Attack
TDP
Nellore

More Telugu News