మా నాయకులు మునిగిపోయే పడవలోకి ఎక్కారు: బసవరాజ్ బొమ్మై

  • పలువురు సీనియర్లకు టికెట్లు నిరాకరించిన బీజేపీ
  • కాంగ్రెస్ లో చేరిన జగదీశ్ శెట్టర్, లక్ష్మణ సవది 
  • మళ్లీ అధికారంలోకి వస్తామని బొమ్మై ధీమా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలకు బీజేపీ టికెట్లను నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగదీశ్ శెట్టర్, లక్ష్మణ సవది వంటి నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిన నేతలపై వారి పేర్లను ప్రస్తావించకుండా సీఎం బసవరాజ్ బొమ్మై విమర్శలు గుప్పించారు. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పడవ మునిగిపోయిందని... కర్ణాటకలో కూడా మునిగిపోతున్న కాంగ్రెస్ పడవలోకి బీజేపీకి చెందిన కొందరు నేతలు ఎక్కారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన వారికి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. బీదర్ జిల్లా బాల్కి నియోజకర్గంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గృహిణికి రూ. 2 వేలు, 10 కేజీల బియ్యం, ఉచిత విద్యుత్ వంటి అబద్ధపు హామీలను కాంగ్రెస్ ఇస్తోందని బొమ్మై విమర్శించారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మరని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచి బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుందని అన్నారు. కర్ణాటకలో మళ్లీ అధికారాన్ని చేపట్టేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.

Basavaraj Bommai
BJP
Congress
Karnataka
Elections

More Telugu News