లోకేశ్ పాదయాత్రలో బాలకృష్ణ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Balakrishna fires on YSRCP
  • ప్రజలంతా కళ్లు తెరిచి సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్న బాలయ్య
  • కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శ
  • చివరకు చెత్త మీద కూడా పన్ను వేశారని మండిపాటు
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రకు ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బాలయ్య మాట్లాడుతూ అధికార వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో ఈ రాష్ట్రం ఎటు వెళ్తోందో అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కంకణబద్ధులై వైసీపీని ఎదుర్కోవాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలందరూ కళ్లు తెరిచి, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. 

ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారని... ఇప్పటి వరకు నాలుగేళ్లయినా ఏమీ చేయలేదని విమర్శించారు.  రూ. 8 లక్షల కోట్ల అప్పులు ఎవడబ్బ సొమ్మని చేశారని ప్రశ్నించారు. ఒకవేళ అప్పులు చేశారే అనుకున్నా... ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. ఒక్క పరిశ్రమను కూడా తెచ్చింది లేదని... ప్రజలు బతుకుదెరువు కోసం వలస పోతున్నారని చెప్పారు. 4 లక్షల మందికి పెన్షన్లను నిలిపివేశారని విమర్శించారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని బాలయ్య చెప్పారు. గంజాయిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను పెంచేశారని, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారని, అన్నిటి మీద పన్నులు పెంచేశారని, చివరకు చెత్త మీద కూడా పన్ను వేశారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
Go Back to Shorts
Balakrishna
Telugudesam
Jagan
YSRCP

More Telugu News