జగన్ ది కిల్ డెవలప్ మెంట్ పాలసీ: ధూళిపాళ్ల నరేంద్ర

  • నిన్న అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం
  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటూ చంద్రబాబుపై ఆరోపణలు
  • రాష్ట్రంలో షెల్ కంపెనీలకు జగనే ఆద్యుడన్న ధూళిపాళ్ల
  • లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి జగన్ అంటూ నక్కా ఆనంద్ బాబు విమర్శలు
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పందించారు. వైఎస్ జగన్ ది కిల్ డెవలప్ మెంట్ పాలసీ అని విమర్శించారు. రాష్ట్రంలో షెల్ కంపెనీలకు జగనే ఆద్యుడని అన్నారు. 20 ఏళ్ల క్రితమే షెల్ కంపెనీలు, క్విడ్ ప్రొ కో చేసిన వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. నేడు ఆ బురద వేరే వారికి అంటించే ప్రయత్నం చేస్తున్నారని ధూళిపాళ్ల మండిపడ్డారు. 

మరో సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు కూడా ఇదే అంశంపై స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా అనేక అవాస్తవాలను దాదాపు రెండు గంటలకు పైగా చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బాబాయి హత్యలో అబ్బాయి పాత్రను దాచేందుకే జగన్ ఈ స్కిల్ డెవలప్ మెంట్ అంశాన్ని తీసుకువస్తున్నారని విమర్శించారు. రూ.371 కోట్ల సొమ్ము చంద్రబాబు ఖాతాలోకి వెళ్లిందని జగన్ అంటున్నారని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగనా ఈ ఆరోపణలు చేస్తోంది? అని నిలదీశారు. 

జగన్ అవినీతిలో రూ.43 వేల కోట్లకు ఆధారాలు ఉన్నట్టు 12 చార్జిషీట్లు దాఖలయ్యాయని, జగన్ 16 నెలలు జైల్లోనూ ఉన్నాడని నక్కా ఆనంద్ బాబు వివరించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Dhulipala Narendra Kumar
Skill Development
Chandrababu
Jagan
TDP
YSRCP
Sri Lanka

More Telugu News