హంగ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు: కోమటిరెడ్డిపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్

  • తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్న కోమటిరెడ్డి
  • కోమటిరెడ్డి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదన్న గుత్తా
  • తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా
తెలంగాణలో రాబోయేది హంగ్ అసెంబ్లీ అంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ కోమటిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. హంగ్ వస్తుందని కోమటిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

వ్యవసాయరంగం పునరుజ్జీవం పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ వెనుక నడవాలని దేశ ప్రజలు భావిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్, బీఆర్ఎస్ చేతిలోనే సురక్షితంగా ఉంటుందని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల మాదిరే కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. తన కుమారుడు గుత్తా అమిత్ రాజకీయ భవిష్యత్తు పార్టీ నిర్ణయం ప్రకారమే ఉంటుందని తెలిపారు. అదానీ లాంటి వాళ్లు ప్రభుత్వ సంస్థలను ముంచేస్తున్నారని... ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు.

Gutha Sukender Reddy
BRS
Komatireddy Venkat Reddy
Congress

More Telugu News