గవర్నర్ ఎందుకు స్వరం మార్చారో చెప్పాలి: రేవంత్ రెడ్డి

  • తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం
  • కేసీఆర్ సర్కారుపై ప్రశంసలు
  • కేసీఆర్ ను కాపాడేందుకు గవర్నర్ ప్రయత్నించారన్న రేవంత్
ఇన్నాళ్లు తెలంగాణ ప్రభుత్వంతో తీవ్ర పోరాటం చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చేసిన ప్రసంగంతో అందరినీ విస్మయానికి గురిచేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తోందంటూ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. 

ఈ నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇప్పటిదాకా అనేక అంశాల్లో సీఎం కేసీఆర్ ను గవర్నర్ చీల్చిచెండాడారని, ఇప్పటికిప్పుడు ఆమె తన గళం మార్చడానికి కారణం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ పచ్చి అబద్ధాలు చెప్పారని, తద్వారా కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాజ్ భవన్ వేదికగా ఇద్దరూ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల విధానాలు ఒకటేనని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ పైనా రేవంత్ విమర్శనాస్త్రాలు సంధించారు. దేశభద్రత, సంస్కృతుల గురించి ఏమాత్రం తెలియని కేటీఆర్ కు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి లేదని అన్నారు. కేటీఆర్ క్యాట్ వాక్ లు, డిస్కో డాన్సుల గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు ఇవే చివరి ఎన్నికలని, ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Revanth Reddy
Governor
Speech
Assembly
Telangana
Congress
BRS
BJP

More Telugu News