టీడీపీ టికెట్ ఖరారు చేసుకునే వైసీపీని విమర్శిస్తున్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ధ్వజం

  • చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి పడ్డారన్న కాకాణి
  • ఒకరిద్దరు వెళ్లిపోయినా వైసీపీకి నష్టం లేదని వ్యాఖ్య
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశం వైసీపీలో దుమారం రేపుతోంది. తన ఫోన్ ను ట్రాప్ చేశారంటూ ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సినిమా థియేటర్ల నుంచి నెలకు రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేయిస్తున్న దుష్ప్రచారమేనని దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో కోటంరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు రూరల్ లో 2014లో ఎంతో పోటీ ఉన్నప్పటికీ కోటంరెడ్డికి జగన్ సీటును కేటాయించారని చెప్పారు. పార్టీ మారాలనుకోవడం ఆయన ఇష్టమని... అయితే వైసీపీపై బురద చల్లడం మంచిది కాదని అన్నారు. కోటంరెడ్డిని చంద్రబాబు ట్రాప్ చేశారని ఆరోపించారు. నిజంగా ఫోన్ ట్రాపింగ్ జరిగినట్టయితే... అవమానం, అనుమానం అనే మాటలు మాట్లాడకుండా విచారణ ముందుకు వెళ్లొచ్చుగా అని ప్రశ్నించారు. 

అది ఫోన్ ట్యాపింగ్ కాదు, ఆడియో రికార్డింగ్ అని తెలుసు కాబట్టే కోటంరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కాకాణి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఖరారు చేసుకునే కోటంరెడ్డి వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినా వైసీపీకి నష్టం లేదని... ఇంతకంటే మంచి నేతలు వస్తారని వ్యాఖ్యనించారు.

Kakani Govardhan Reddy
Sajjala Ramakrishna Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Kotamreddy Sridhar Reddy

More Telugu News