మహిళా ఐపీఎల్ జట్ల కోసం రేసులో దిగ్గజ సంస్థలు

BCCI may make big money from Womens Indian Premier League team sale
  • టెండర్ డాక్యుమెంట్లను కొనుగోలు చేసిన 33 సంస్థలు
  • సాంకేతిక బిడ్లు దాఖలు చేసింది 17 సంస్థలే
  • 25న విజేతలను ప్రకటించనున్న బీసీసీఐ
మహిళా ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం దేశంలోని దిగ్గజ వ్యాపార సంస్థలతోపాటు, ఇప్పటికే పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలను కలిగిన వారు సైతం పోటీపడుతున్నారు. బుధవారం మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీ విజేతలను బీసీసీఐ ప్రకటించనుంది. మొత్తం ఐదు మహిళా ఫ్రాంచైజీలను బీసీసీఐ వేలానికి ఉంచింది. 

అదానీ గ్రూప్, టోరెంట్ గ్రూప్, కోటక్ మహీంద్రా, హాల్దీరామ్స్, శ్రీరామ్ గ్రూప్, స్లింగ్ షాట్-రూట్ మొబైల్ తదితర సంస్థలు సాంకేతిక బిడ్లను దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఇప్పటికే బిడ్లు దాఖలు చేశాయి. ఇలా మొత్తం 15-17 సంస్థలు సాంకేతిక బిడ్లను సమర్పించాయి.

ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, ఆర్పీఎస్ జీ గ్రూప్, చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా సాంకేతిక బిడ్లు దాఖలు చేయలేదని సమాచారం. బిడ్లు దాఖలు గడువు సోమవారంతో ముగిసింది. మొత్తం 33 సంస్థలు టెండర్ డాక్యుమెంట్లను కొనుగోలు చేశాయి. ఇందులో 10 ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా ఉన్నాయి. మొదటి ఐదేళ్ల పాటు మహిళల ఐపీఎల్ టోర్నమెంట్ ప్రసార హక్కులను రూ.941 కోట్లకు రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 కొనుగోలు చేయడం తెలిసిందే.

ఒక్కో ఐపీఎల్ జట్టు రూ.500-600 కోట్లు పలకొచ్చని తెలుస్తోంది. దీంతో ఐదు జట్లకు కలిపి బీసీసీఐ సుమారు రూ.3,000 కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని సొంతం చేసుకోనుంది.
Go Back to Shorts
BCCI
Womens
IPL
team sale

More Telugu News