ఈ నెల 24న ఆస్కార్ నామినేషన్లు... ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందం

  • మరో నాలుగు రోజుల్లో ఆస్కార్ ఫైనల్ నామినేషన్లు
  • భారత్ తరఫున 10 సినిమాలు
  • రేసులో ముందున్న ఆర్ఆర్ఆర్
  • అధికారిక ఎంట్రీ దక్కకపోవడం నిరాశ కలిగించిందన్న రాజమౌళి
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల తుది నామినేషన్లను జనవరి 24న ప్రకటించనున్నారు. ఈ ఏడాది భారత్ తరఫున 10 చిత్రాలు ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. వీటిలో ఆర్ఆర్ఆర్ ఒకటి. 

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. కానీ భారత ప్రభుత్వం తరఫున ఆస్కార్ కు అధికారిక ఎంట్రీ సాధించలేకపోయింది. భారత్ తరఫున అధికారిక చిత్రంగా ఛెల్లో షో (ది లాస్ట్ ఫిల్మ్ షో) ఆస్కార్ కు వెళ్లింది. 

అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రబృందం సొంతంగా ప్రయత్నాలు చేసి ఆస్కార్ రేసులో నిలిచింది. ఈ క్రమంలో ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, పలు ఫిలిం క్రిటిక్స్ అవార్డులను ఆర్ఆర్ఆర్ చిత్రం సొంతం చేసుకుంది. మరో నాలుగు రోజుల్లో వెలువడనున్న తుది నామినేషన్ల కోసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం నుంచి ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ చిత్రం అధికారిక ఎంట్రీ పొందలేకపోవడం నిరాశ కలిగించిందని అన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పనితీరు, నియమనిబంధనలు ఎలాంటివో తనకు తెలియదని, అందుకే ఆ నిర్ణయంపై తానేమీ మాట్లాడలేనని స్పష్టం చేశారు. అయితే భారత్ నుంచి ఆస్కార్ కు ఛెల్లో షో చిత్రం వెళ్లడం హర్షణీయమని పేర్కొన్నారు. 

ఆర్ఆర్ఆర్ కు అధికారిక ఎంట్రీ ఇస్తే బాగుండేదని విదేశీయులు కూడా భావిస్తున్నారని రాజమౌళి అన్నారు. అయితే, ఎంట్రీ లభించనందుకు తామేమీ బాధపడుతూ కూర్చోవడంలేదని, అసలా విషయాన్ని అక్కడితో వదిలేశామని వివరించారు.

RRR
Oscars
Final Nominations
Rajamouli
Jr NTR
Ram Charan

More Telugu News