లిక్కర్ స్కాం వ్యవహారం నుంచి కవితను ఎవరూ కాపాడలేరు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • కవిత, రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
  • లిక్కర్ క్వీన్ అంటూ విమర్శించిన రాజగోపాల్ రెడ్డి
  • అన్నా... మాట జారకు అంటూ కవిత కౌంటర్
  • నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా అంటూ రాజగోపాల్ రెడ్డి రిప్లై
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 

నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా... నువ్వు లిక్కర్ స్కాంలో ఉన్నది నిజం అంటూ వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కాం వ్యవహారం నుంచి కవితను ఎవరూ కాపాడలేరు అని పేర్కొన్నారు. కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో నాపై విషప్రచారం చేశారు... తద్వారా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతిమయమైన కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు, కవిత తనను ఉద్దేశించి చేసిన ట్వీట్ ను కూడా ఆయన పంచుకున్నారు. 

అంతకుముందు, పత్రికల్లో వచ్చిన ఓ కథనంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ లిక్కర్ క్వీన్ పేరు చార్జిషీటులో 28 సార్లు ప్రస్తావించారు అంటూ ట్వీట్ చేశారు. అందుకు కవిత బదులిస్తూ... రాజగోపాల్ అన్న... తొందరపడకు, మాట జారకు అంటూ హితవు పలికారు. 28 సార్లు నా పేరు చెప్పించినా, 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గానే రాజగోపాల్ రెడ్డి పైవిధంగా స్పందించారు.

Komatireddy Raj Gopal Reddy
Kalvakuntla Kavitha
Delhi Liquor Scam
BJP
BRS
Telangana

More Telugu News