గుజరాత్‌లో వంతెన కూలిన ఘటన: 141కి పెరిగిన మృతుల సంఖ్య

141 Killed In Gujarat Bridge Collapse
  • క్షణక్షణానికి పెరుగుతున్న మృతుల సంఖ్య
  • ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 500 మంది
  • 177 మందిని రక్షించిన సహాయక బృందాలు
  • గుజరాత్‌లో నేటి కార్యక్రమాలను రద్దు చేసుకున్న ప్రధాని  
గుజరాత్‌లోని తీగల వంతెన కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఇప్పటి వరకు 141 మంది మరణించినట్టుగా అధికారులు లెక్క తేల్చారు. 177 మందిని రక్షించారు. మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తీగల వంతెన నిన్న సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ వెంటనే అక్కడ దృశ్యాలు భీతావహంగా మారిపోయాయి. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 500 మంది వరకు ఉన్నారు. ప్రమాదం జరిగాక కొందరు నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకోగా, మరికొందరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారి కోసం బోట్ల సాయంతో గాలిస్తున్నారు. 

సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరమ్మతుల కోసం ఏడు నెలలపాటు మూసివేసిన ఈ బ్రిడ్జిని ఈ నెల 26న తిరిగి తెరిచారు. ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బ్రిజేష్ మెర్జా ప్రకటించారు. ప్రమాదం నేపథ్యంలో గుజరాత్‌లో నేటి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని హోం మంత్రి హర్ష్ సంఘ్వి తెలిపారు.
Go Back to Shorts
Gujarat
Morbi District
Machchhu River

More Telugu News