ముందు రూ. 100 కోట్లు అన్నారు.. ఇప్పుడు రూ. 15 కోట్లు అంటున్నారు: కిషన్ రెడ్డి

Kishan Reddy fires on KCR
  • ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ సృష్టి అన్న కిషన్ రెడ్డి
  • నలుగురు ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన బీజేపీకి ఒరిగేది ఏమీ లేదని వ్యాఖ్య
  • ఫిరాయింపుల మాస్టర్ కేసీఆర్ అని విమర్శ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగోళ్ల వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ సృష్టించిన నాటకమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొనుగోలు వ్యవహారంలో తొలుత వంద కోట్లు అన్నారని.... ఆ తర్వాత మాట మార్చి రూ. 15 కోట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటని అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన బీజేపీకి వచ్చేదేమీ లేదని, టీఆర్ఎస్ కు పోయేదేమీ లేదని చెప్పారు. రాజీనామా చేసి వచ్చే నేతలనే తాము బీజేపీలో చేర్చుకుంటామని అన్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే విధంగా బీజేపీలోకి వచ్చారని అన్నారు. పార్టీ ఫిరాయింపుల మాస్టర్ కేసీఆర్ అని చెప్పారు. 

రూ. 100 కోట్లతో ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఆ ఎమ్మెల్యేలకు అంత స్థాయి కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇదంతా ప్లాన్ గా చేసిన వ్యవహారమని చెప్పారు. దీనికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబంపై ముందు కేసులు పెట్టి జైలుకు పంపాలని అన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని చెప్పారు. ఏదో ఒక డ్రామా చేసి మునుగోడులో గెలవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నమని విమర్శించారు. తమ ముందు కేసీఆర్ విఠలాచార్య సినిమాలు పని చేయవని అన్నారు.
Go Back to Shorts
Kishan Reddy
BJP
kcr
TRS
MLAs

More Telugu News