పవన్ కల్యాణ్ కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా... అందరం కలుద్దాం: చంద్రబాబు

Chandrababu insists Pawan Kalyan to join hands
  • విజయవాడలో పవన్ తో ముగిసిన చంద్రబాబు సమావేశం
  • వైసీపీ వంటి నీచమైన పార్టీని ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు
  • అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడి
  • ముందు ఓ కార్యాచరణ రూపొందిద్దామని సూచన
విజయవాడలో జనసేనాని పవన్ కల్యాణ్ తో సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ వంటి నీచమైన పార్టీని తన జీవితంలోనే చూడలేదని విమర్శించారు. 40 ఏళ్లుగా ఎప్పుడూ చూడని రాజకీయాలు చూస్తున్నానని తెలిపారు. 

ఏ పార్టీకైనా తమ అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఉంటుందని, అంతిమంగా ప్రజలే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. అంతేతప్ప, వీళ్లకు తొత్తులుగా ఉంటే మీటింగులు పెట్టుకోనిస్తారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ఇలాంటి ధోరణులు చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యం. అందుకే పవన్ కల్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా... అందరం కలుద్దాం.... కలిసి ప్రజాస్వామ్యం కోసం పోరాడదాం. ఇదే విషయాన్ని పవన్ తోనూ చర్చించాను. ముందుగా కార్యాచరణ రూపొందించుకోగలిగితే, ఆ తర్వాత ఎన్నికలప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎలా పోటీ చేస్తారనేది వారే నిర్ణయించుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన అంశం" అని చంద్రబాబు వివరించారు.
Go Back to Shorts
Chandrababu
Pawan Kalyan
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News