చంద్రబాబు మాటలకు పగలబడి నవ్విన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

  • పవన్ ఇలా మాట్లాడ్డం ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు
  • కదిలిపోయానని చెప్పిన టీడీపీ అధినేత 
  • ఇప్పుడు పవన్ వంతు వచ్చిందని వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇలా ఉందని వ్యంగ్యం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం విజయవాడలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. ఇటీవల ఘటనల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలిపారు. ఈ భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. 

చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతిపక్షాలను లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విపక్షంలేదు, రెండో ప్రతిపక్షమైన జనసేన లేదు... ఏ పార్టీని లెక్క చేయకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియాను కూడా పరిగణనలోకి తీసుకోవడంలేదని, కులాలు, ప్రాంతాల రంగు పులుముతున్నారని అన్నారు. 

వాళ్లు చేసే తప్పులను ప్రశ్నించే పనిలో మనం ఉంటే, మనల్ని విమర్శించి పబ్బం గడుపుకునే పనిలో వాళ్లున్నారు అని వివరించారు. మానసికంగా, శారీరకంగా, నైతికంగా ఎన్నిరకాలుగా విమర్శించాలో అన్ని రకాలుగా విమర్శిస్తున్నారు. మీరూ మనుషులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"నేను ఇవాళ చూశాను... పవన్ కల్యాణ్ గారికి ఎప్పుడూ ఇలా మాట్లాడడం అలవాటులేదు. సినిమాల్లో హీరోగా ఉండడం తప్ప ఇక్కడికొచ్చి తిట్టే అలవాటు లేదు. అలాంటి వ్యక్తిని ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నాలాంటి వాడే కదిలిపోయాడు. నాకు చాలా ఓపికని అందరూ అంటారు. నేనే భరించలేకపోయాను. ఇప్పుడు ఆయన వంతు వచ్చింది, రేపు ఎవరి వంతు వస్తుందో తెలియదు. ఇదీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు మాటలకు పవన్ కల్యాణ్ పగలబడి నవ్వారు. దాంతో, సీరియస్ గా సాగుతున్న ప్రెస్ మీట్ లో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. చంద్రబాబుతో సహా, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అందరి ముఖాల్లో నవ్వులు కనిపించాయి.

Pawan Kalyan
Chandrababu
Press Meet
Vijayawada
TDP
Janasena

More Telugu News