నీతి ఆయోగ్ విందులో ప్రధాని కూర్చున్న టేబుల్ నెం.1 ఆహ్వానితుల్లో జగన్ కూడా ఒకరు: విజయసాయిరెడ్డి

  • ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం
  • ప్రధానితో విందులో పాల్గొన్న సీఎం జగన్
  • జగన్ ఎప్పుడూ ప్రచారం కోరుకోలేదన్న విజయసాయి
  • చంద్రబాబుపై విమర్శలు
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న టేబుల్ నెం.1లోనే సీఎం జగన్ కూడా కూర్చుని ఉండడం కనిపించింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. నీతి ఆయోగ్ లంచ్ లో ప్రధాని కోసం ఏర్పాటు చేసిన టేబుల్ నెం.1కు ఆహ్వానితులుగా ముగ్గురు సీఎంలు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారని, వారిలో ఏపీ సీఎం జగన్ ఒకరని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ కు, విపక్షనేత చంద్రబాబుకు మధ్య తేడా వివరించారు. గంటకు పైగా ప్రధాని మోదీతో కలిసి ఒకే టేబుల్ వద్ద విందులో మాట్లాడుకున్నా ప్రచారం కోరుకోని జగన్ స్థాయి ఎక్కడ? నిలబడి ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు ఐదు గంటలకు సరిపడా కట్టుకథ అల్లిన బాబు, ఆయన పచ్చకుల మీడియా ఎక్కడ? అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. 

ప్రజల్లో స్వయం ప్రకాశం లేని బాబు, 1994లో వెన్నుపోటుతో అధికారం లాక్కుని, 1999లో కార్గిల్ యుద్ధం వల్ల, 2014లో మోదీ గారి హవాలో అధికారంలోకి రావడం తప్పితే... సొంతంగా ఒక్కసారి కూడా గెలిచింది లేదు అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిని ఇంగ్లీషులో 'పేరసైట్స్' అంటారని, అంటే 'పరాన్నజీవులు' అని వివరించారు. "ఢిల్లీలోని అన్ని పార్టీల ఇళ్లలో తిని, అందరి వాసాలు లెక్కపెట్టిన ఈ చంద్రబాబు అనే ద్రోహిని ఎవరైనా 'మళ్లీ కలుద్దాం, మా ఇంటికి రండి' అని ఎందుకు అంటారు?" అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Vijayasai Reddy
Jagan
Narendra Modi
Chandrababu
Niti Aayog
New Delhi

More Telugu News