ఆయన మాత్రమే కోహ్లీ సమస్యను తీర్చగలడు: అజయ్ జడేజా

  • ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లీ
  • కోహ్లీ సమస్యను సచిన్ మాత్రమే తీర్చగలడన్న అజయ్  
  • వీరిద్దరూ కలవడానికి ఒక్క ఫోన్ కాల్ చాలని వ్యాఖ్య
ప్రపంచ క్రికెట్ బ్యాట్స్ మెన్లలో ఒకడిగా పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ... ప్రస్తుతం ఫామ్ ను కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఎంత ప్రయత్నించినా మునుపటి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. దీంతో కోహ్లీ ఫామ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

ఈ అంశంపై టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా మాట్లాడుతూ... విరాట్ కోహ్లీ ఫామ్ లేమిపై సచిన్ టెండూల్కర్ జోక్యం చేసుకోవాలని చెప్పాడు. కోహ్లీ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని అర్థం చేసుకోగల ఏకైక వ్యక్తి సచిన్ మాత్రమేనని అన్నాడు. కోహ్లీ ఆట తీరు విషయంలో సచిన్ జోక్యం చేసుకోవాలని తాను ఎనిమిది నెలల క్రితమే చెప్పానని గుర్తు చేశాడు. కోహ్లీతో కలిసి విందు ఆరగించాలని సచిన్ కు సూచించానని చెప్పాడు. 

14 ఏళ్లకే కెరీర్ ను ప్రారంభించిన సచిన్... తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడని... ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడని అజయ్ అన్నాడు. అందుకే కోహ్లీని సచిన్ మాత్రమే గాడిలో పెట్టగలడని తాను చెపుతున్నానని పేర్కొన్నాడు. వీరిద్దరు కలవడానికి ఒక్క ఫోన్ కాల్ చాలని చెప్పాడు. ఏమైనా యువ క్రీడాకారులు ఏదో ఒక సమయంలో ఇలాంటి గడ్డు కాలాన్ని అనుభవించక తప్పదని అన్నాడు.

Ajay Jadeja
Virat Kohli
Sachin Tendulkar
Team India

More Telugu News