సీఎం యోగి చేతుల మీదుగా అయోధ్య ప్రధాన ఆలయ నిర్మాణానికి భూమి పూజ

  • వేదమంత్రాల నడుమ గర్భాలయ నిర్మాణానికి భూమి పూజ
  • సీఎం యోగి, డిప్యూటీ సీఎం మౌర్య హాజరు
  • 500 ఏళ్ల పోరాటం ఫలించిందన్న ముఖ్యమంత్రి
  • నిర్మాణానికి సంబంధించిన పుస్తకం ఆవిష్కరణ
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయం నిర్మాణంలో ప్రధాన ఘట్టం మొదలైంది. ప్రధాన ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ బుధవారం నిర్వహించారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. 500 ఏళ్ల పాటు ఆలయం కోసం చేసిన పోరాటం ఫలితమే ఇదంటూ.. ప్రతీ భారతీయునికి ఇది గర్వకారణమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆలయం ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ ను గుర్తు చేసుకున్నారు. 

11 మంది పూజారులు వేద మంత్రాలతో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, రామ్ మందిర్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా పాల్గొన్నారు. గర్భాలయం నిర్మాణం కోసం రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా బన్సీ పహర్ పూర్ నుంచి శాండ్ స్టోన్ తెప్పించారు. 

ఆలయ నిర్మాణానికి సంబంధించిన పనులను తెలియజేసే ఒక పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆవిష్కరించి అక్కడి ఇంజనీర్లకు అందజేశారు. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి అనుకూలంగా 2019లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం తెలిసిందే.

Yogi Adityanath
Ram temple
construction
first stone

More Telugu News