చార్ ధామ్ యాత్రకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు.. 6 రోజుల్లో 16 మంది మృతి!

  • ఎక్కువ మరణాలు గుండె సమస్యల వల్లే
  • ఆరోగ్య పరీక్షలు చేయించుకోని భక్తులు
  • ఎత్తయిన పర్వతాల్లో చెక్ పోస్ట్ ల వద్ద రద్ధీ
  • ముందస్తు వైద్య పరీక్షలతోనే రక్షణ
ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్న వారు చార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు వైద్యుల సూచనలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే, మే 3న యాత్ర ఆరంభం కాగా, మొదటి ఆరు రోజుల్లోనే 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారేనని అధికార వర్గాలు వెల్లడించాయి.

సముద్ర మట్టానికి 10,000 నుంచి 12,000 అడుగుల ఎత్తులోని మందిరాలను దర్శించే క్రమంలో వీరు ప్రాణాలకు ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు. కరోనా ముందు మాదిరిగా కాకుండా.. ఆరోగ్యపరమైన ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలని ఈ విడత స్థానిక అధికార యంత్రాంగం అడగడం లేదు. రోజువారీగా ఇంత మందినే అనుమతిస్తామని ముందు ప్రకటన చేసినప్పటికీ.. వాస్తవంలో భక్తుల సంఖ్య పరంగా నియంత్రణలు కనిపించడం లేదు. 

‘‘భక్తుల సంఖ్యా పరంగా నియంత్రణలు అమలు కావడం లేదు. దీంతో చెక్ పోస్ట్ ల వద్ద రద్దీ నెలకొంది. భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం లేదు. ఎవరైనా అన్ ఫిట్ అని తేలితే.. ఏం జరిగినా మాదే బాధ్యతన్న ధ్రువీకరణ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు’’ అని ఉత్తరకాశి చీఫ్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ కేఎస్ చౌహాన్ తెలిపారు. 

దీనిపై ఉత్తరాఖండ్ ఆరోగ్య మంత్రి ధన్ సింగ్ రావత్ స్పందిస్తూ.. నాలుగు ధామాల వద్ద చక్కని ఆరోగ్య సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. హెల్త్ సర్టిఫికెట్ లు కూడా తీసుకురావాలని త్వరలో భక్తులను కోరనున్నట్టు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్ నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యుమునోత్రితో కూడినదే చార్ ధామ్ యాత్ర.

Char Dham yatra
piligrims
deaths
health

More Telugu News