బొత్సపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్‌పై డిస్కం సీఎండీ వివరణ

  • హైదరాబాద్‌లోని తన ఇంటికి బొత్స 15 నెలలుగా విద్యుత్ బిల్లు కట్టడం లేదంటూ ట్వీట్ చక్కర్లు
  • అది బోగస్ ట్వీట్ అన్న రఘుమారెడ్డి
  • డిస్కం ట్విట్టర్‌ ఖాతాలో మంత్రికి సంబంధించి ఎలాంటి సమాచారమూ షేర్ చేయలేదని వివరణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ట్వీట్‌పై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) సీఎండీ రఘుమారెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని తన ఇంటి విద్యుత్ బిల్లును బొత్స 15 నెలలుగా చెల్లించడం లేదని, ఈ కారణంగానే ఆయన నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు డిస్కం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నట్టుగా చెప్పే ట్వీట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. 

ఈ ట్వీట్‌పై స్పందించిన రఘుమారెడ్డి.. అది బోగస్ ట్వీట్ అని స్పష్టం చేశారు. మంత్రికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని డిస్కం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయలేదని వివరణ ఇచ్చారు. సంస్థ పేరుతో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రఘుమారెడ్డి హెచ్చరించారు.

Hyderabad
Botsa Satyanarayana
TSSPDCL
Andhra Pradesh
Power Bill

More Telugu News