జీపీఎస్‌కు వ్యతిరేకంగా నేడు ఏపీలో ‘విశ్వాస ఘాతుక’ నిరసనలు

  • ప్రతిపక్షంలో ఉండగా సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారు
  • అధికారంలోకి వచ్చాక జీపీఎస్ అంటున్నారు
  • పాత పింఛన్ విధానాన్నే అమలు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం
  • హెచ్చరించిన సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్
సీపీఎస్ రద్దుపై ముఖ్యమంత్రి జగన్ వైఖరిని నిరసిస్తూ నేడు ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (సీపీఎస్ఈఏ) రాష్ట్రవ్యాప్తంగా విశ్వాస ఘాతుక నిరసనలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు హామీ పింఛన్ పథకం (జీపీఎస్) అమలు చేస్తామని ప్రకటించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో విశ్వాస ఘాతుకం పేరుతో నిరసన సభలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. 

పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధి ఆ హామీ నెరవేర్చకపోతే కాలర్ పట్టుకుని ఇంటికి పంపమని జగన్ ఎన్నికలకు ముందు చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి ఇప్పుడాయనను ఎక్కడి పంపాలో ఆయనే చెప్పాలన్నారు. రాష్ట్ర బడ్జెట్  విషయంలో ఏ రోజూ శ్వేతపత్రం విడుదల చేయని ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగుల లెక్కపై మాత్రం కోట్ల ఖర్చుతో అసత్య ప్రచారాలు చేస్తోందని అప్పలరాజు, పార్థసారథి మండిపడ్డారు.

Andhra Pradesh
Jagan
CPS
GPS
APCPSEA

More Telugu News