విజయవాడలో హై అలర్ట్.. 144 సెక్షన్ అమలు!

  • సీఎం కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయుల పిలుపు
  • విజయవాడకు వచ్చే అన్ని రహదారుల్లో పోలీసుల మోహరింపు
  • పలు చోట్ల ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు పిలుపునివ్వడంతో విజయవాడలో పోలీసులు హై అలర్ట్ విధించారు. నగరంలో 144 సెక్షన్ ను విధించారు. విజయవాడకు వచ్చే అన్ని రహదారుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. దావులూరు, పొట్టిపాడు, కాజా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. 

రైలు, రోడ్డు మార్గాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు విజయవాడ, గుంటూరుకు చేరుకోకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద పూర్తి నిఘా ఉంచారు. సెల్ ఫోన్లు, ఐడీ కార్డులు చెక్ చేసి పంపుతున్నారు. ఇప్పటికే దావులూరు చెక్ పోస్ట్ వద్ద 27 మందిని, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. యూటీఎఫ్ చేపట్టిన నిరసనకు అనుమతి లేదని ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

Vijayawada
144 Section
Jagan
UTF

More Telugu News