యాదాద్రిలో అపశ్రుతి.... మంత్రి పువ్వాడపై తేనెటీగల దాడి

  • యాదాద్రి ఆలయ పునఃప్రారంభం
  • సీఎం కేసీఆర్ తో పాటు హాజరైన మంత్రి పువ్వాడ
  • మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా తేనెటీగల దాడి
  • అలాగే పూజ కొనసాగించిన పువ్వాడ
  • చికిత్స కోసం హైదరాబాద్ పయనం
  • తాను క్షేమంగానే ఉన్నానని ట్విట్టర్ లో వెల్లడి
యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సతీసమేతంగా పాల్గొన్నారు. అయితే, మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువు నిర్వహించారు. ఈ క్రతువులో పాల్గొన్న మంత్రి పువ్వాడ తదితరులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఆలయ వేదపండితులు, మంత్రి సెక్యూరిటీ సిబ్బందిని కూడా తేనెటీగలు వదల్లేదు. 

అయితే తేనెటీగలు కుట్టినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. దీనిపై అజయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అనుకోని రీతిలో తేనెటీగలు దాడి చేశాయని తెలిపారు. వైద్యులు రెండ్రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారని వివరించారు. తాను క్షేమంగానే ఉన్నానని, కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

Puvvada Ajay Kumar
Honey Bees
Attack
Yadadri

More Telugu News