ఇక తెలంగాణ‌లోనూ యూపీ ఫ‌లితాలే!: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

raja singh prediction on telangana assembly poll results
  • యూపీ స‌హా నాలుగు రాష్ట్రాల్లో గెలుపు దిశ‌గా బీజేపీ
  • యోగి గెలవాలని యావత్ భారత్ కోరుకుందన్న రాజాసింగ్ 
  • కేసీఆర్ కి కలలోకి కూడా మోదీ వస్తున్నార‌ని వ్యంగ్యం  
  • కాంగ్రెస్ పార్టీ ఖ‌త‌మైన‌ట్టేనని వ్యాఖ్య‌
దేశంలో ఇటీవ‌లే జ‌రిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తి కావ‌స్తోంది. ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ క్లియ‌ర్ మెజారిటీతోనే అధికార ప‌గ్గాలు చేజిక్కించుకునే అవ‌కా‌శాలు క‌నిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విక్ట‌రీ ఖ‌రారైపోయింది కూడా. ఇలాంటి స‌మ‌యంలో బీజేపీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మ‌రో ఏడాదిలో జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జోస్యం చెప్పారు. తెలంగాణ‌లోనూ యూపీ త‌ర‌హా ఫ‌లితాలే రిపీట్ అవుతాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

యూపీలో దౌర్జన్యాలు, అన్యాయాలపై యోగి ఆదిత్యనాథ్‌ ఉక్కుపాదం మోపార‌ని రాజా సింగ్ అన్నారు. అంతేకాకుండా ప్రజా సంక్షేమానికి కృషి చేశార‌ని.. ఈ కార‌ణంగానే యోగి గెలవాలని యావత్ భారత్ కోరుకుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని రాజా సింగ్‌ అభిప్రాయప‌డ్డారు. 

కేసీఆర్ కి కలలోకి కూడా మోదీ వస్తున్నార‌ని.. నిద్ర‌లోనూ కేసీఆర్‌ ఉలిక్కిపడుతున్నార‌ని రాజా సింగ్‌ ఎద్దేవా చేశారు. ఇక దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, తెలంగాణలో కూడా ఈసారి ఆ పార్టీ ఖతం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాజా సింగ్ చెప్పారు.
Go Back to Shorts
Uttar Pradesh
Raja Singh
BJP
Yogi Adityanath

More Telugu News