విద్యార్థుల తరలింపుపై కేంద్రం చర్యలు బాగున్నాయ్: సీజేఐ జస్టిస్ రమణ

  • ప్రభుత్వానికి తాము ఆదేశాలివ్వలేమని వెల్లడి
  • విద్యార్థుల తరలింపు తమకూ ఉత్కంఠేనని కామెంట్
  • పాత తప్పుల నుంచి ఇంకా నేర్చుకోలేదంటూ ఆవేదన
ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపుపై కేంద్రానికి తామెలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ప్రభుత్వమే తరలింపుల కోసం చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంచి చర్యలే చేపడుతోందని, దానిపై తానెలాంటి కామెంట్ చేయబోనని తేల్చి చెప్పారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తిగానే ఉన్నాయని ఆయన కొనియాడారు. విద్యార్థుల తరలింపుపై ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఉన్నారన్న విషయం తనకూ తెలుసన్నారు. 

విద్యార్థులను వీలైనంత త్వరగా భారత్ కు తీసుకొచ్చేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను ఇవాళ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎ.ఎస్. బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం విచారించింది. 

‘‘పాత తప్పుల నుంచి మనం ఇంకా ఏమీ నేర్చుకోలేకపోవడం విచారకరం. ఇప్పటికీ యుద్ధాన్నే నమ్ముకుంటున్నాం. దాని గురించి మేం ఎక్కువగా మాట్లాడం. కానీ, అక్కడ ఇరుక్కుపోయిన విద్యార్థుల గురించి మాకూ బాధగానే ఉంది’’ అని సీజేఐ రమణ పేర్కొన్నారు. ఈ పిటిషన్లు నిన్ననే విచారణకు రాగా.. యుద్ధం ఆపాలంటూ రష్యా అధ్యక్షుడికి తాను ఆదేశాలు ఇవ్వగలనా? అంటూ సీజేఐ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Supreme Court
Justice N.V. Ramana
Russia
Ukraine
War

More Telugu News