జట్టులో ఎవరి స్థానమూ పదిలం కాదు.. ఏ సభ్యుడూ ఫిక్స్ అని అనుకోవద్దు: సునీల్ గవాస్కర్

  • ఎంతో మంది ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లు వస్తున్నారు
  • తమకూ చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు
  • తమ వెనుక గట్టి పోటీ ఉందని జట్టు సభ్యులు గుర్తుంచుకోవాలి
  • భారత్ సహా అన్ని జట్లకూ వర్తిస్తుందన్న మాజీ దిగ్గజం
కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా మాంచి జోష్ లో ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్, వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, ఇప్పుడు శ్రీలంకనూ వైట్ వాష్ చేసేందుకు సిద్ధమవుతోంది. రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం బెంచ్ సామర్థ్యాన్ని చెక్ చేసుకునేందుకు ఇవాళ్టి మ్యాచ్ లో ప్రయోగాలనూ చేయనున్నట్టు తెలుస్తోంది. 

అయితే, టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టులో ఎవరి స్థానమూ శాశ్వతం కాదని, చోటు దక్కినవారు తప్పనిసరిగా కొనసాగుతారన్న గ్యారెంటీ కూడా లేదని చెప్పారు. ఇప్పుడు టీమిండియా కొత్త యువరక్తంతో ఉరకలెత్తుతోందని, ఆరోగ్యకరమైన పోటీ ఉందని పేర్కొన్నారు. 

‘‘భారత క్రికెట్ కు ఇది ఎంతో ఉద్విగ్నభరితమైన సమయం. ఎందుకంటే ఎంతో మంది నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు బయటకు వస్తున్నారు. ‘మాకూ ఒక్క చాన్స్’ ఇవ్వాలంటున్నారు. కాబట్టి జట్టులో చోటు దక్కినవాళ్ల స్థానాలు పదిలం అన్న మాటే లేదు. ఎవరూ తాను శాశ్వతమని అనుకోకూడదు. తన వెనుక గట్టి పోటీ ఉందని గుర్తుంచుకోవాలి. భారత్ కైనా.. ఏ జట్టుకైనా అది వర్తిస్తుంది’’ అని ఆయన చెప్పారు. కాగా, ఇవాళ సాయంత్రం శ్రీలంకతో రెండో టీ20 జరగనుంది.

Sunil Gavaskar
Cricket
Team India
Rohit Sharma

More Telugu News