విజయనగరంలో భారీ చోరీ.. 5 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

  • గంటస్తంభం వద్దనున్న రవి జువెల్లర్స్‌లో ఘటన
  • దుకాణం పైనుంచి లోపలికి చొరబడిన దొంగలు
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐ
విజయనగరం జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఓ బంగారు నగల దుకాణంలోకి చొరబడిన దొంగలు ఏకంగా 5 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పట్టణంలోని గంటస్తంభం వద్దనున్న రవి జువెల్లర్స్‌లో ఈ ఘటన జరిగింది. దుకాణం యజమాని కోట రామ్మోహన్ సోమవారం రాత్రి షాపు మూసేసి ఇంటికి వెళ్లిపోయారు. మంగళవారం సెలవు దినం కావడంతో బుధవారం ఉదయం తిరిగి దుకాణం తెరిచారు. లోపల వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దుకాణం వెనక గ్రిల్స్‌ను తొలగించి దొంగలు దుకాణంలోకి ప్రవేశించినట్టు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. కాగా, పక్కనే ఉన్న మరో దుకాణంలోనూ చోరీకి విఫలయత్నం చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Vizianagaram
Andhra Pradesh
Theft
Gold Shop

More Telugu News