కరోనా పరీక్షలను గాలికి వదిలేస్తున్న దేశాలు.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ

WHO warns countries over corona tests
  • ప్రపంచవ్యాప్తంగా దిగివస్తున్న కరోనా కేసులు
  • పరీక్షలు తగ్గించేసిన దేశాలు
  • అలసత్వం పనికిరాదన్న డబ్ల్యూహెచ్ఓ
  • మరో వేరియంట్ వస్తే అది ఒమిక్రాన్ కంటే ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరిక
నిన్నమొన్నటి వరకు ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగి వస్తోంది. దీంతో ఆయా దేశాలు కూడా కరోనా పరీక్షలను తగ్గించేశాయి. అయితే, కరోనా విషయంలో అలసత్వం పనికిరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లను గుర్తించేందుకు పరీక్షలు చాలా కీలకమని, వాటిని తక్షణం కొనసాగించాలని ఆ సంస్థ సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్ కెర్ఖోవ్ సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేయడం ఒక్కసారిగా పడిపోయినట్టు తాము గుర్తించామని అన్నారు. ఒక వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించిందీ, లేనిదీ తెలుసుకునేందుకు కానీ, వైద్యం అందించేందుకు కానీ పరీక్షలు తప్పనిసరి అని పేర్కొన్నారు. కాబట్టి పరీక్షల విషయంలో ఎంతమాత్రం నిర్లక్ష్యం వద్దన్నారు.

ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్ వేరియంటే చివరిది కాదని, మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ఇటీవలే పేర్కొన్న మారియా.. కొత్త వేరియంట్లను ‘వైల్డ్‌కార్ట్ ఎంట్రీ’గా అభివర్ణించారు. ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ కనుక వెలుగు చూస్తే అది మరింత శక్తమంతంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి వ్యాక్సినేషన్ జోరు పెంచాలని సూచించారు.
Go Back to Shorts
WHO
Omicron
Tests
Vaccination

More Telugu News