జగన్ కు చిరంజీవి దండం వెనుక అదీ అర్థం.. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యంగ్య వ్యాఖ్యలు

  • తన కంటే పెద్ద నటుడని అర్థం వచ్చేలా దండం పెట్టారు
  • అంతేతప్ప అందులో వేరే ఏమీ లేదు
  • జగన్ తీరు పులకేశిలా ఉందన్న రామ్మోహన్ నాయుడు
ఏపీ సీఎం జగన్ తో సినీ పరిశ్రమ వర్గాల్లోని ప్రముఖల భేటీపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు చిరంజీవి దండం పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సెటైర్లు విసిరారు. తప్పు లేనప్పుడు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆత్మాభిమానాన్ని చంపుకుని జగన్ దగ్గరకు ఎందుకు పోవాల్సి వచ్చిందంటూ కొన్ని ప్లాట్ ఫాంలలో చూశానని, ఇండస్ట్రీకి పెద్దగా ఉండే వ్యక్తి ఆయన దగ్గరకు పోయి ఎందుకు దండం పెట్టుకోవాల్సి వచ్చిందని చాలా మంది అంటున్నారని గుర్తు చేశారు.

‘నేనే పెద్ద నటుడిని అనుకుంటే.. నా కంటే పెద్ద నటుడివి నువ్వు’ అని అర్థం వచ్చేలా మాత్రమే జగన్ కు చిరంజీవి దండం పెట్టారన్నారు. అంతే తప్ప ఆ దండంలో వేరే ఉద్దేశమేమీ లేదని చెప్పారు. వైజాగ్ కు సినీ పరిశ్రమ రావాలంటూ జగన్ ఇప్పుడు చెబుతున్నారని, కానీ, చంద్రబాబు నాయుడే దాని కోసం ప్రయత్నించారని, భూములు కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని గుర్తు చేశారు.

అయితే, ఇప్పటికే ఏర్పాటు చేసిన రామానాయుడు స్టూడియో భూమిని లాక్కోవడానికి సీఎం జగన్ ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. జగన్ చేష్టలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. రాష్ట్రంలో ఆ 151 మంది తప్ప జగన్ ను పొగిడే వ్యక్తి ఎవరూ లేరని అన్నారు. ఆయన వ్యక్తిత్వం వెనక పులకేశి లాంటి రాజు కూడా దాగున్నాడని అర్థమవుతోందన్నారు.

 లేని సమస్యను ఆయనే సృష్టించి, ఇండస్ట్రీ వాళ్లను పిలిపించుకుని, ఆ సమస్యకు పరిష్కారం చూపించినట్టు సినీ ప్రముఖులకు గీతోపదేశం చేసి వారితో పొగిడించుకునే పరిస్థితికి వచ్చారన్నారు. ఇంత దిగజారుడు చర్యలకు బహుశా ఎవరూ పాల్పడరేమోనని అన్నారు.

Telugudesam
Rammohan Naidu
Chiranjeevi
YS Jagan

More Telugu News