ఏపీలో రోడ్డు ప్రమాద బాధితులకు ఇక నగదు రహిత చికిత్స: సీఎం జగన్

  • జగన్ అధ్యక్షతన రహదారి భద్రత మండలి సమావేశం
  • కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో ట్రామా కేర్ సెంటర్లు
  • రహదారులపై కార్లు, బైకులకు ప్రత్యేకంగా మార్కింగ్
  • రోడ్డుపక్కనున్న దాబాల్లో మద్యం విక్రయించకుండా చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ అధ్యక్షతన నిన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రహదారి భద్రత మండలి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 వైద్య కళాశాలలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తెచ్చేవారికి మద్దతు ఇవ్వాలని అన్నారు. అలాగే, ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రహదారులపై కార్లు, ద్విచక్ర వాహనాలకు వేర్వేరుగా లైన్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చన్నారు. అలాగే, రోడ్డుపక్కన ఉండే దాబాల్లో మద్యం విక్రయాలు జరగకుండా చూడడం ద్వారా కూడా ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వ సహకారంతో డ్రైవింగ్ స్కూలు ఏర్పాటు చేయాలని జగన్ అన్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారు త్వరగా కోలుకునేందుకు వీలుగా విశాఖలో రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే, రహదారి భద్రత నిధి ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Andhra Pradesh
Road Accident
Jagan

More Telugu News