అప్పట్లోనే మూడు రివ్యూలు ఉండుంటే సచిన్ లక్ష పరుగులు ఈజీగా కొట్టేవాడు: షోయబ్ అక్తర్

Shoaib Akhtar terms Sachin Tendulker a tough guy
  • రవిశాస్త్రితో అక్తర్ యూట్యూబ్ చర్చా కార్యక్రమం
  • ఎక్కువగా బ్యాట్స్ మెన్ అనుకూల నిబంధనలేనని వెల్లడి
  • సచిన్ అప్పట్లో మేటి బౌలర్లను ఎదుర్కొన్నాడని కితాబు
  • సచిన్ గట్టివాడు అని ఉద్ఘాటన
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు చేసిన సచిన్ ను ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు సైతం ఎంతో గౌరవిస్తారు. తాజాగా, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అక్తర్ తన యూట్యూబ్ చానల్ కోసం టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పుడున్న నిబంధనలు అప్పట్లోనే ఉండుంటే సచిన్ టెండూల్కర్ లక్ష పరుగులు చేసేవాడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్రికెట్లో ఉన్న నిబంధనలు అత్యధిక శాతం బ్యాట్స్ మెన్ కు లాభించేవేనని అక్తర్ వెల్లడించాడు.

 "ఇప్పుడు ఇన్నింగ్స్ లో రెండు బంతులు ఉపయోగిస్తున్నారు. మూడు రివ్యూలు అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటివల్ల బ్యాట్స్ మెన్ కే అదనపు లాభం. సచిన్ ఆడిన రోజుల్లోనే ఈ విధంగా మూడు రివ్యూలు ఉండుంటే ఏంజరిగేదో ఒక్కసారి ఊహించుకోండి. సునాయాసంగా లక్ష పరుగులు తన ఖాతాలో వేసుకునేవాడు. పాపం.. సచిన్! కెరీర్ మొదట్లోనే వసీం అక్రమ్, వకార్ యూనిస్ షేన్ వార్న్ వంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత నన్ను, బ్రెట్ లీని ఎదుర్కొన్నాడు. ఆపై తర్వాతి తరం ఫాస్ట్ బౌలర్లను కూడా ఎదుర్కొన్నాడు. అందుకే నేను సచిన్ ను గట్టివాడు అంటాను" అని అక్తర్ వివరించాడు.
Go Back to Shorts
Shoaib Akhtar
Sachin Tendulkar
Rules
Batsmen
Bowlers

More Telugu News