మున్నేరు వద్ద ఐదుగురు చిన్నారుల గల్లంతు.. పడవలతో గాలింపు

five children missing in krishna dist eturu
  • కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు వద్ద ఘటన
  • మున్నేరు ఒడ్డున చిన్నారుల దుస్తులు, సైకిళ్లు
  • చీకటి పడడంతో గాలింపు చర్యలకు ఆటంకం
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామం వద్ద మున్నేరులో ఐదుగురు చిన్నారులు అదృశ్యమైన ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు రాత్రి అవుతున్నా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వారి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో మున్నేరు ఒడ్డున వారి దుస్తులు, సైకిళ్లు ఉండడంతో స్నానాల కోసం దిగి గల్లంతై ఉంటారని భావిస్తున్నారు.

విషయం తెలిసిన గ్రామస్థులు సైతం పిల్లల కోసం మున్నేరు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మున్నేరు వద్దకు చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను ఏటూరు పంపాలని అధికారులను కోరారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మున్నేరులోకి నాటు పడవలను పంపి గాలిస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గల్లంతైన చిన్నారుల వయసు 8 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు.
Go Back to Shorts
Krishna District
Eturu
Children
Andhra Pradesh

More Telugu News