సంపులో నోట్ల కట్టలు.. అడ్డంగా దొరికిపోయిన రాజకీయనాయకుడు.. డ్రయ్యర్​ తో ఆరబెట్టి, ఇస్త్రీ చేసిన అధికారులు.. ఇదిగో వీడియో

Business Man Hides Cash In Under Ground Water Tank
  • మధ్యప్రదేశ్ లోని దామోలో ఐటీ రెయిడ్స్
  • రూ.కోటి నోట్లను సంపులో దాచిన శంకర్ రాయ్
  • మొత్తం 8 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన నగలు సీజ్
సంపులో కోట్లాది రూపాయల నోట్ల కట్టలను దాచేసి.. అడ్డంగా దొరికిపోయాడో రాజకీయనాయకుడు. ఆదాయపన్ను శాఖ అధికారులు తడిసిపోయిన ఆ నోట్లను స్వాధీనం చేసుకుని హెయిర్ డ్రయ్యర్లతో ఆరబెట్టి, ఇస్త్రీ చేశారు. మధ్యప్రదేశ్ లోని దామో జిల్లాలో జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ రాయ్ అనే వ్యాపారి ఇంట్లో లెక్కల్లోకి రాని డబ్బు గురించి సమాచారం అందుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.

రూ.కోటి విలువైన నోట్ల కట్టలను సంపులో దాచినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు. సంపులో దాచిన ఆ నోట్ల కట్టల బ్యాగును బయటకు తీసిన అధికారులు.. తడిసిపోయిన నోట్లను డ్రయ్యర్ తో ఆరబెట్టారు. ఇస్త్రీ కూడా చేశారు. ఈ దాడుల్లో శంకర్ రాయ్ నుంచి మొత్తం 8 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి దాదాపు 39 గంటల పాటు ఈ సోదాలు జరిగినట్టు రెయిడ్స్ కు నేతృత్వం వహించిన జబల్ పూర్ ఐటీ జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ చెప్పారు.

కాగా, రాయ్ ఫ్యామిలీ మూడు డజన్లకు పైగా బస్సులను ఉద్యోగుల పేరిట నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. వారి ఆస్తుల గురించి మరింత సమాచారం ఇస్తే రూ.10 వేల నజరానా ఇస్తామని ప్రకటించారు. శంకర్ రాయ్ కాంగ్రెస్ పార్టీ తరఫున దామో నగర పాలిక చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు కమల్ రాయ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
Go Back to Shorts
Madhya Pradesh
IT Raids
Cash

More Telugu News