'ఆత్మ'ల కోసం.. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన 17 ఏళ్ల బాలిక.. విస్తుపోయే విషయాలు వెల్లడించిన తల్లిదండ్రులు!

Bengaluru Girl Anushka leave home to talk to souls
  • ‘షామనిజా’నికి ప్రభావితురాలైన బాలిక
  • తననెవరూ అర్థం చేసుకోవడం లేదంటూ ఆవేదన
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
  • రెండు నెలలైనా ఆచూకీ శూన్యం
ఆత్మలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి అనుష్క మాత్రం ఆత్మలు ఉన్నాయనే నమ్మింది.  అంతేకాదు, వాటితో మాట్లాడతానంటూ ఇల్లొదిలి వెళ్లిపోయింది. అలా వెళ్లిన ఆమె ఆచూకీ రెండు నెలలైనా ఇప్పటికీ కానరాలేదు. పోలీసులు కూడా ఆమె కోసం గాలిస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. కుమార్తె కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు అర్చన, అభిషేక్ సామాజిక మాధ్యమాల్లో ఆమె వివరాలను షేర్ చేస్తూ ఎవరికైనా కనిపిస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు.

ఆత్మలతో మాట్లాడేందుకని వెళ్లిపోయినట్టుగా భావిస్తున్న అనుష్క ‘షామనిజా’నికి ప్రభావితురాలై ఉంటుందని భావిస్తున్నారు. కంటికి కనిపించని వాటిపై నమ్మకం పెంచుకోవడాన్ని షామనిజం అంటారు. దీనికి ప్రభావితమైనవారు పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తుంటారు. తమ కుమార్తె కూడా ఇలానే మాట్లాడేదని ఆమె తల్లి అర్చన తెలిపారు. ఇంట్లోంచి వెళ్లిపోయే ముందు రోజు కూడా ఆమె అలానే ప్రవర్తించిందని, తాము ఎంతగానో నచ్చజెప్పామని పేర్కొన్నారు. తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదంటూ తిరిగి తమపైనే పెద్దగా అరిచిందని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.

అక్టోబరు 31న అనుష్క రెండు జతల దుస్తులు, రూ. 2500 నగదుతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు తల్లిదండ్రులు తెలిపారు. 12వ తరగతి పాసైన తర్వాత అనుష్క షామనిజానికి ప్రభావితురాలైందని పేర్కొన్నారు. షామనిజం కోసం తాను ధ్యానం చేసుకుంటానని చెబితే, అదేదో ఇంట్లోనే చేసుకోవాలని కూడా చెప్పామని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబరు నుంచే ఆమెలో మార్పు కనిపించిందని, దీంతో ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Soul
Bengaluru
Girl
Karnataka

More Telugu News