పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా?: రేవంత్ రెడ్డి

  • వడ్డెర కాలనీ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ఇవ్వలేదు
  • ఈ ప్రాంతానికి పీజేఆర్ లాంటి నాయకుడు కావాలి
  • కేటీఆర్ తక్షణమే వచ్చి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పీజేఆర్ వంటి నాయకుడు కావాలని అన్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాదులోని గోపన్నపల్లి వడ్డెర కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాలు ఇచ్చేంత వరకు స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో వీరందరికీ వంటా వార్పు చేస్తామని చెప్పారు.
 
మున్సిపల్ మంత్రి కేటీఆర్ వెంటనే ఇక్కడకు రావాలని... స్థానికంగా ఉన్న 250 కుటుంబాలు వెయ్యి మంది ప్రజల బాధ్యత కేటీఆర్ దేనని అన్నారు. తక్షణమే ఇక్కడకు వచ్చి పట్టాలను అందజేయాలని డిమాండ్ చేశారు. పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా? అని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి పీజేఆర్ లాంటి నాయకుడు ఉండాలని చెప్పారు. పీజేఆర్ లేని లోటు హైదరాబాదులో, తెలంగాణలో కనిపిస్తోందని అన్నారు.

Revanth Reddy
Congress
PJR
KTR
TRS

More Telugu News