సీఎం జగన్ తో ముగిసిన బుగ్గన, సజ్జల భేటీ

  • ఉద్యోగుల డిమాండ్లే ప్రధాన అజెండా
  • పీఆర్సీపై సీఎంతో చర్చ
  • ప్రస్తుతం 27 శాతం ఐఆర్ ఇస్తున్నామన్న సజ్జల
  • నేడు సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ ఉండదని వెల్లడి
సీఎం జగన్ తో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ ముగిసింది. ఉద్యోగ సంఘాల నేతలతో నిన్న తాము జరిపిన చర్చల వివరాలను బుగ్గన, సజ్జల సీఎం జగన్ కు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఎంతమేర పీఆర్సీ ఇవ్వాలన్నదానిపై సీఎం వారిరువురితో చర్చించారు.

సీఎంతో భేటీపై సజ్జల స్పందిస్తూ, ప్రస్తుతం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఉద్యోగుల మిగిలిన డిమాండ్ల పరిష్కారంపైనా చర్చించామని వెల్లడించారు. సీఎస్ కమిటీ సిఫారసులు, 14.29 శాతం ఫిట్ మెంట్ అమలు చేసే క్రమంలో ఐఆర్ తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

నేడు సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం ఉండదని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగులతో ఇవాళ సీఎస్, ఆర్థికశాఖ మంత్రి మరోసారి చర్చిస్తారని తెలిపారు. రేపు, లేదా సోమవారం సీఎంతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ ఉండొచ్చని సూచనప్రాయంగా తెలిపారు. పీఆర్సీపై చర్చల ప్రక్రియ రేపటికి పూర్తికావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

CM Jagan
Buggana Rajendranath
Sajjala Ramakrishna Reddy
PRC
Employees
Andhra Pradesh

More Telugu News