బూతులు తిట్టేవారికి ప్రత్యేకంగా అవార్డులిస్తే మంత్రి కొడాలి నానికే ఇవ్వాలి: సోము వీర్రాజు

Somu Veerraju comments on AP Govt
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సోము వీర్రాజు
  • కొడాలి నాని ఓ బూతు మహారాజు అంటూ వ్యాఖ్యలు
  • జగన్ సర్కారుది పిడివాదమని విమర్శ 
  • బద్వేలు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి కొడాలి నాని ఓ బూతు మహారాజు అని అభివర్ణించారు. బూతులు తిట్టేవారికి ప్రత్యేకంగా అవార్డులు ఇస్తే కొడాలి నానికే ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు. దేశాన్ని రక్షించే ఉద్దేశంతోనే కేంద్రం పెట్రోల్ పై చార్జీలు విధించిందని, అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటాలు వస్తున్నాయని వెల్లడించారు.

'అన్ని రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గిస్తుంటే, ఏపీ ప్రభుత్వం తగ్గించనంటుందా... ఏమిటీ వితండవాదం? జగన్ ప్రభుత్వానిదంతా పిడివాదం!' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థ పిల్లలను కొట్టినట్టు పెట్రోల్ చార్జీలు తగ్గించమంటున్న పిల్లలను కూడా కొడతారా? అంటూ నిలదీశారు. దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన చేస్తుంటే, మమ్మల్ని పెట్రోల్ పోసి తగులబెడతామంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానాన్ని వారంలో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు... ఇచ్చిన హామీ నెరవేర్చని మిమ్మల్ని తగులబెట్టారా? అంటూ ప్రశ్నించారు.

'బద్వేలులో మాకు డిపాజిట్ కూడా దక్కలేదని ప్రచారం చేస్తున్నారు... బద్వేలు ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ఉంటే మాకు చాలా ఓట్లు వచ్చేవి' అని సోము వీర్రాజు అన్నారు. 'మాది తోక పార్టీ అంటున్నారు.... రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఎవరికి తోకల్లా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదా?' అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Somu Veerraju
AP Govt
Petro Prices
Kodali Nani
Andhra Pradesh

More Telugu News