చర్చల కోసం అమెరికా పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించిన కిమ్

  • అమెరికా శత్రుత్వ వైఖరిని విడనాడే వరకు చర్చల ప్రసక్తే లేదు
  • అప్పటి వరకు అణ్వాయుధాలను సమకూర్చుకుంటూనే ఉంటాం
  • దక్షిణ కొరియాతో త్వరలోనే చర్చలు ప్రారంభిస్తాం: కిమ్
కూర్చుని మాట్లాడుకుందామంటూ అమెరికా పంపిన ఆహ్వానాన్ని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ దేశంపై చూపిస్తున్న శత్రుత్వ వైఖరిని కప్పిపుచ్చుకునేందుకు అమెరికా ఆడుతున్న నాటకంగా దీనిని అభివర్ణించారు. శత్రుత్వ విధానాలను అమెరికా విడనాడే వరకు తాము అణ్వాయుధాలను పోగు చేసుకుంటూనే ఉంటామని కిమ్ స్పష్టం చేశారు. అమెరికాతో చర్చలు కూడా జరపబోమన్నారు. పార్లమెంటులో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 మరోవైపు, దక్షిణ కొరియాతో ఆగిపోయిన చర్చలను త్వరలోనే పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. కిమ్ తాజా వ్యాఖ్యలను విశ్లేషకులు మరోలా అభివర్ణిస్తున్నారు. ఉత్తరకొరియాపై అమెరికా విధించిన ఆర్థిక, ఇతర రంగాల్లోని ఆంక్షల నుంచి ఉపశమనం పొందేందుకు దక్షిణ కొరియా సాయాన్ని కిమ్ ఆశిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు. కాగా, చర్చలకు సిద్ధమన్న కిమ్ ప్రకటనపై దక్షిణ కొరియా స్పందించింది. చర్చలకు తాము కూడా సిద్ధమేనని, ఇరు దేశాల మధ్య పెండింగులో ఉన్న సమస్యలను  పరిష్కరించుకోవాల్సి ఉందని పేర్కొంది.

Kim Jong Un
North Korea
South Korea
America

More Telugu News