కాబూల్​ విమానాశ్రయం వద్ద మరిన్ని దాడులు జరిగే ముప్పు.. తరలింపులు ప్రమాదకరమన్న అమెరికా

  • డ్రోన్ దాడుల నేపథ్యంలో ఆందోళన
  • అమెరికా పౌరులంతా అక్కడ్నుంచి వెళ్లాలని సూచన
  • అప్రమత్తంగా ఉన్నామన్న పెంటగాన్ ప్రతినిధి
అమెరికా ఎయిర్ స్ట్రయిక్స్ చేసిన నేపథ్యంలో కాబూల్ విమానాశ్రయం వద్ద మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది. బదులు తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిజ్ఞ చేసిన 24 గంటల్లోనే పెంటగాన్ డ్రోన్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో పేలుళ్ల సూత్రధారి హతమైనట్టు అమెరికా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయానికి దాడుల ముప్పు మరింత అధికంగా ఉంటుందని కాబూల్ లోని అమెరికా ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది.  

విమానాశ్రయం గేట్ల వద్ద ఉన్న అమెరికా పౌరులంతా అక్కడ్నుంచి వెంటనే వెళ్లిపోవాలని సూచించింది. కాగా, అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని, ప్రమాదాలన్నింటినీ బేరీజు వేస్తున్నామని, అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. తరలింపులకు ఇంకా మూడు రోజుల సమయమే ఉన్నందున.. ఇకపై నిర్వహించబోయే తరలింపులు అత్యంత ప్రమాదకరమైనవని శ్వేత సౌధం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఇస్లామిక్ స్టేట్ తో తాలిబన్లకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అంటోంది.

USA
Afghanistan
Taliban
ISKP
Islamic State
Pentagon
White House

More Telugu News